కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తనపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే చెంప పెట్టులాంటిదని, నిరాధారమైన ఆరోపణలు చేసిన వారికి తమ పార్టీ ప్రజాప్రతినిధులు సరైన జవాబు ఇచ్చారని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు స్పష్టం చేశారు. హ్యాట్రిక్ సాధించిన తర్వాత ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. స్థానిక సంస్థల సమస్యలపై మాట్లాడలేదని, ఉద్యమ కాలంలో పనిచేయలేదని, ఎవరికీ అందుబాటులో ఉండలేదని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు.
ఆయన మాటల్లోనే.. నాకు స్వరాష్ట్ర ఉద్యమానికి సంబంధం లేదని కొంతమంది ఆరోపణలు చేశారు. సదరు వ్యక్తులు చాలా తెలుసుకోవాలి. నోరుంది కదా? అని మాట్లాడితే ఎవరూ పడరు. పెద్దపల్లి నుంచి ఢిల్లీ వరకు జరిగిన అనేక ఉద్యమాల్లో నా పాత్ర ఉంది. పార్టీ ఏదైనా స్వరాష్ట్ర సాధన కోసం నా వంతు ప్రయత్నం చేసిన. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అలాగే సంస్థల సమస్యలపై నేను మాట్లాడలేదని పచ్చి అబద్దాలు చెప్పారు.
నిజానికి శాసన మండలి రికార్డులు చూస్తే నేను ఏమి మాట్లాడానో తెలుస్తుంది. జిల్లా, మండల పరిషత్తులకు విధులు, నిధులు ఏమిటనే దానిపై స్పష్టత ఇవ్వాలని.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పూర్తిస్థాయిలో ఎన్నికై, కుర్చీలో కూర్చున్నప్పటికీ వారెందుకు ఎన్నికయ్యారో? వారి విధులేమిటో తెలియని పరిస్థితి ఉన్న విషయాన్ని.. జిల్లా పరిషత్ చైర్మన్లకు ఉండాల్సిన అధికారాల గురించి, స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు.. వంటి ఎన్నో అంశాలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల స్పందన వచ్చేలా చూసిన. సమైక్య రాష్ట్రంలో ఉన్న నాటి స్థానిక సంస్థలకు, నేటి స్థానిక సంస్థలకు ఒకసారి పోలిస్తే.. మా పాత్రతో పాటు ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరో మాట నేను ఎవరికీ అందుబాటులో ఉండడం లేదన్న పచ్చి అబద్ధం చెప్పి ఓట్లు దండుకోవాలని చూశారు. కానీ, అవన్నీ సదరు వ్యక్తులకు రివర్స్ అయ్యాయి. ఎన్నికల్లో పోటీదారులు హూందాగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఇక ముందు కూడా నా వంతు పాత్రపోషిస్త. కచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్త. నాపై గౌరవం, నమ్మకం ఉంచి నాకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రితోపాటుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
నా గెలుపునకు నిర్విరామంగా కృషిచేసిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారి అండదండలతో మున్ముందు ఉమ్మడి జిల్లాలో అందరినీ కలుపుకొని పోత. పార్టీ ఆదేశానుసారం ముందుకెళ్త.
కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఎం తో నమ్మకంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసి చూపిస్తానని ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టం చేశారు. తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. బలహీనవర్గాల బిడ్డగా నాపై కేసీఆర్కు అపార నమ్మకమున్నది. నాకు టికెట్ ఇవ్వడం బలహీనవర్గాలకు ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రి భావించారు. ఎం త విశ్వాసంతో బరిలో దింపారో, అంతే విశ్వాసంతో పార్టీలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు నన్ను గెలిపించారు. నాకీ అవకాశాన్ని కల్పించిన అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు, నా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంట.
నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా పని తీరు ఎలా ఉంటుందో.. మరోసారి నిరూపిస్త. నిరంతరం ప్రజలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంట. నా దృష్టికి తీసుకొచ్చే ప్రతి సమస్యనూ ప్రభుత్వం దృష్టికి లేదా.. నాకున్న సంబంధాలతో సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్త. ఈ వర్గం, ఆ వర్గమని కాదు, బలహీనవర్గాల బిడ్డగా అన్ని వర్గాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంట. నా శక్తి మేరకు వాటిని పరిష్కరించే ప్రయత్నిస్త. గతంలో.. వివిధ హోదాల్లో పని చేసిన. ఒక సమస్యను ఎలా పరిష్కరించవచ్చో నాకు తెలుసు. ఆ అనుభవం ఉన్నది.
అందరు మంత్రులతో పరిచయాలున్నయ్. సీఎం మంచి మనసుతో సమస్య వింటారు. ఇలా ఏ కోణంలో చూసినా.. ప్రజలు, స్థానిక సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించడానికి ఈ పదవిని ఒక అవకాశంగా మలుచుకుంట. గత రాజకీయ అనుభవాలకు, ప్రస్తుతం రాజకీయ జీవితానికి కొత్త మార్పు కనిపిస్తున్నది. కొత్తగా శాసన మండలికి వెళ్లడమే దీనికి కారణం. ప్రజలతో సంబంధాలు కొనసాగించడంలో.. అలాగే ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు వెళ్లడంలో.. నా పనితీరు ఎలా ఉంటుందో ముఖ్యమంత్రికి తెలుసు.
ఇదే సమయంలో బలహీన వర్గాల బిడ్డగా వారి సమస్యలకు మొదటి ప్రాధాన్యతనిస్త. మొత్తంగా నాపై నమ్మకం ఉంచి ఎంతో విశ్వాసంతో నన్ను ఎమ్మెల్సీగా చేసిన ముఖ్యమంత్రి అడుగు జాడల్లో నడుస్తూ.. ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందరితో కలిసి పనిచేస్త.