మేడ్చల్, జనవరి26(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ, శంభీపూర్ రాజు నియామకమయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో 2001 చేరిన శంభీపూర్ రాజు 2002లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన విభాగం ట్రెజరర్గా, 2004 నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీసీ సెల్ జనరల్ కార్యదర్శిగా పని చేశారు. 2006 నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా, 2008 సంవత్సరంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2009 నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా 2014 వరకు కొనసాగారు. 2015 సంవత్సరంలో మొదటిసారిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. నవంబర్ 2021లో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎకగ్రీవంగా ఎన్నికై రెండవ సారి ఎమ్మెల్సీగా గెలుపొందారు.
పార్టీ విధేయుడికి పట్టం
పార్టీ స్థాపించిన నాటి నుంచి టీఆర్ఎస్లో చేరిన శంభీపూర్ రాజు అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వెన్నంటే ఉంటూ అంచలంచెలుగా ఎదిగారు. పార్టీ విధేయుడిగా గుర్తింపు తెచ్చుకుని పార్టీ పదవులకు వన్నె తెచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై మంచి మార్కులు సంపాదించారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరి విజయవంతానికి విశేషంగా కృషి చేశారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన శంభీపూర్ రాజుకు పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతగా భావిస్తా
జిల్లా అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తా. జిల్లాలోని మంత్రిమల్లారెడ్డి, ఎమ్మెల్యేల వివిధ ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తా. రానున్న శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ గెలుపే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఉద్యమ నాయకుడిగా తనకు అధ్యక్ష పదవిని కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నా. నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు.