హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వరకు నామిషన్లు స్వీకరణ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు కూడా ఈసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, మహమ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగిసింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు దేవసాని చిన్న గోవిందరెడ్డి, మహమ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు పదవీకాలం ఈ ఏడాది మే 31తో ముగిసింది. రెండు రాష్ర్టాల్లోని ఈ స్థానాలకు కాలపరిమితి ముగిసే సమయానికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా కట్టడికి లాక్డౌన్ విధించటంతో ఆలస్యమైంది.
19 మంది కొత్త ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతోపాటు వచ్చే ఏడాది జనవరి నాటికి మొత్తం 19 మంది కొత్త ఎమ్మెల్సీలు శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. గవర్నర్కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి పాడి కౌశిక్రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ప్రతిపాదించింది. వచ్చే ఏడాది జనవరి 4 నాటికి ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటా కింద మరో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. తాజా 6 స్థానాలు కలుపుకొంటే మొత్తం 19 స్థానాలకు కొత్త ఎమ్మెల్సీలు రానున్నారు.
వచ్చే ఏడాది జూన్ 21 నాటికి రెండు రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ కానున్నాయి. చట్ట సభల్లో సంఖ్యాబలం దృష్ట్యా ఈ అన్ని స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీల్లో భానుప్రసాద్రావు, నారదాసు లక్ష్మణ్రావు, కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కూచుకుంట్ల దామోదర్రెడ్డి, కే నారాయణరెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, వెన్నవరం భూపాల్రెడ్డి, పురాణం సతీశ్, శంభీపూర్ రాజు, బాలసాని లక్ష్మీనారాయణ, తేరా చిన్నపరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది నాలుగో తేదీతో ముగుస్తుంది. ఆ లోపు ఈ 12 స్థానాలకు ఈసీ తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జూన్ 21తో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. డీ శ్రీనివాస్ పదవీకాలం పూర్తి కానున్నది.