చండీఘడ్: పంజాబ్ గవర్నర్ వైఖరిని ఖండిస్తూ ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే సీఎం భగవంత్మాన్కు ఆ అవకాశం ఇవ్వకుండా ఆ రాష్ట్ర గవర్నర్ అడ్డుపడ్డారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమ్ ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్ ఇంటికి మార్చ్ చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రత్యేక అసెంబ్లీ నిర్వహిస్తామని, సెప్టెంబర్27న ఆ సమావేశాలు ఉంటాయని సీఎం మాన్ తెలిపారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్తు సమస్యలు, పంట కాల్చడం వంటి అంశాలను చర్చిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్ని గవర్నర్ రద్దు చేసిన అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సీఎం మాన్ వెల్లడించారు.
ప్రత్యేక సమావేశాల్లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆప్ ప్రభుత్వం భావిస్తోంది. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చిచే ప్రయత్నం చేస్తున్నట్లు ఆప్ ఆరోపించింది. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఆపరేషన్ లోటస్ పేరుతో ఆ దందా సాగుతోందని ఆప్ విమర్శలు చేసింది.