మహబూబాబాద్ : తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి ఊరురా చెరువుల్లో నీలి విప్లవం వచ్చిందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (MLA Shankar Naik ) అన్నారు. జిల్లాలోని కేసముద్రం మండలం కేంద్రంలోని పెద్ద చెరువులో ప్రభుత్వం సరఫరా చేసిన చేప పిల్లలను ( Fish fingerlings ) విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ(Mission Kakatiya) ద్వారా చెరువల్లో పూడికను తీయడంతో చెరువుల్లో నీరు నిండి అటు వ్యవసాయం , ఇటు చేపల వృద్ధి సాధ్యమైందని అన్నారు. నీలి విప్లవం తెలంగాణ ప్రతి చెరువులో కనపడుతున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వివిధ రూపాల్లో సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప నాయకుడని అభివర్ణించారు.
కాలేశ్వరం (Kaleshwaram) జలాలతో చెరువులను నింపడం, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, పరికరాలు, వాహనాలు అందించడంతో మత్స్యకారులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.