హైదరాబాద్ : ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కానీ స్వరాష్ర్టంలో సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఇరిగేషన్ పద్దులపై ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం సంకల్పించారు. పల్లెర్లు మొలిచిన బీడు భూములు.. నేడు ఆకుపచ్చ భూములుగా మారాయి.
ఇంజినీర్లకే పెద్ద ఇంజినీర్గా మారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం రూపకల్పన చేశారు. ప్రజల ఆకాంక్షలపై మనసు పెట్టి ఆలోచించే సీఎం కేసీఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు సాగునీటి కోసం రైతులు.. తాగునీటి కోసం ప్రజలు విలవిలలాడేవారు. మన వాటాను సద్వినియోగం చేసుకోలేకపోయాం. సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతోనే నేడు తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయి. పంటలు పండించుకుని రైతులు సంతోషంగా ఉన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు పూర్వ వైభవం కల్పించారు. రైతుల అవసరాలు, నీటి లభ్యత మేరకు చెక్డ్యాంలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారు. కనివీని ఎరుగని రీతిలో పంటలు పండిస్తున్నారు. సాగునీటి రంగంలో దేశంలోనే తెలంగాణ మేటిగా నిలబడిందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు.