దమ్మపేట, నవంబర్ 29: అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో దమ్మపేటలో నూతన కోర్టు భవన ఏర్పాటు పనులు వేగవంతంగా సాగుతున్నాయని కొత్తగూడెం జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పేర్కొన్నారు. దమ్మపేట ఎస్సీ హాస్టల్ భవన సముదాయం వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన కోర్టు భవన పనులను ఎమ్మెల్యే మెచ్చాతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ.. కోర్టు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. కోర్టు భవనం ఏర్పాటుకు ఎస్సీ హాస్టల్ భవన సముదాయం బాగుందని, చిన్న చిన్న పనులు చేయిస్తే సరిపోతుందని అన్నారు. దమ్మపేటలో కోర్టు భవనం ఏర్పాటుకు ఎమ్మెల్యే మెచ్చా పట్టుబట్టారని, చివరికి సాధించారని అన్నారు. సంక్రాంతి నాటికి ఇక్కడ కోర్టు భవనం ప్రారంభమవుతుందని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందిపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కోర్టు ఏర్పాటు ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించినట్లు గుర్తుచేశారు. దమ్మపేటలో కోర్టును తప్పకుండా ఏర్పాటుచేస్తామని సీఎం అన్నారని వివరించారు. అలాగే ఇటీవల కొత్తగూడెం వచ్చిన హైకోర్టు జడ్జి రాధారాణిని కూడా కలిసి పనులు వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. అనంతరం జడ్జిని ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు సత్కరించారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు రాజేంద్రప్రసాద్, పీపీ రాధాకృష్ణ, బీ.మాధవరావు, బొర్రా వెంకటకృష్ణ, రామిశెట్టి రమేశ్, అనిత, లక్కినేని నరేంద్ర, ఉడతనేని శ్రీనివాసరావు, రమణ, మారం సతీశ్, పైడి వెంకటేశ్వరరావు, స్వామి, దొడ్డాకుల రాజేశ్వరరావు, సోయం ప్రసాద్, దారా మల్లికార్జునరావు, తోట రాజులు, ఉయ్యాల చిన్నవెంకటేశ్వర్లు, దారా యుగంధర్, పగడాల రాంబాబు, యార్లగడ్డ బాబు, చిన్నశెట్టి సత్యనారాయణ, సోడె గంగరాజు, రావూరి వీరయ్య, అబ్దుల్ జిన్నా, పానుగంటి చిట్టిబాబు, పండూరి వీరబాబు, కవులూరి నాగయ్య, పసుమర్తి పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు.