హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, అక్టోబర్ 27: లెఫ్టిస్ట్ను అని చెప్పుకొని రైట్ పార్టీ బీజేపీలో చేరినప్పుడే మీ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టు అయ్యిందని బీజేపీ నేత ఈటల రాజేందర్పై మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. రెండుసార్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఏంచేయని మీరు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏంచేస్తారని ప్రశ్నించారు. బుధవారం హుజూరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఈటలకు రాజకీయ జీవి తం ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఇన్నేండ్లలో హుజూరాబాద్కు మీరు చేసిందేమిటని నిలదీశారు. మీరిచ్చే డబ్బులు, చికెన్, మందుకు ప్రజలు అమ్ముడుపోరన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్కే ప్రజామద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. ప్రజలు ఆలోచించి, అన్ని వర్గాలవారికి న్యాయం చేస్తున్న టీఆర్ఎస్కు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ సారయ్య, మాజీ మంత్రి ఎల్ రమణ పాల్గొన్నారు.