హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్ప లౌకిక రాజ్యంగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ఆదివారం సంబంధిత శాఖల అధికారులతో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల విశ్వాసాలను కాపాడే విధంగా, ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా సుపరిపాలన కొనసాగుతున్నదన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. ఇఫ్తార్ విందుకు పలువురు మంత్రులతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ప్రముఖులు హాజరవుతారన్నారు. అతిథులకు ఆహానపత్రికలు సకాలంలో అందేలా చూడడంతో పాటు వివిధ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీ చేయించాలన్నారు. ఈ సందర్భంగా మ్యాప్ను పరిశీలించి.. స్టేడియం మొత్తం కలిగియదిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ మాట్లాడుతూ ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలనీ, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరాకు ఆటంకం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని, ముఖ్య కూడళ్లలో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, వాహనాల రాకపోకలు సజావుగా సాగే విధంగా చూడాలని సూచించారు.