హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని ఈతరం విద్యార్థులకు తెలియజేసేందుకు ‘పునాస’ పత్రికను ప్రతి పాఠశాలకు పంపిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరించిన మహిళల ప్రత్యేక ‘పునాస’ సంచికను శనివారం తన కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. విద్యార్థుల్లో సామాజిక స్పృహ కలిగించేందుకు సాహిత్యం బలమైన సాధనమని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాహిత్య అధ్యయనం చేసేందుకు ప్రతి పాఠశాలకు సాహిత్య పత్రిక వెళ్లాలని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సాహిత్య అకాడమీతో కలిసి పాఠశాలలు, కళాశాలల్లో సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ‘పునాస’ పత్రిక ప్రతి పాఠశాలలకు వెళ్లేలా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తెలిపారు. మంత్రి సబిత నిర్ణయం పట్ల సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాహిత్యాన్ని గడపగడపకు తీసుకుపోవాలన్న తమ ప్రయత్నానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సాహం తోడైందని చెప్పారు.