హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్ సాగర్ తీరంలో అమరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్మారక చిహ్నం నిర్మాణ పనులను సోమవారం రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ ప్రాంతమంతా కలియదిరిగి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని నిత్యం స్మరించుకునేలా నిర్మిస్తున్న స్మారక చిహ్నం గొప్ప కట్టడంగా నిలువనుందన్నారు.
అమరుల త్యాగాన్ని చాటిచెప్పేలా నిర్మాణం ఉంటుందన్నారు. అనంతరం నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు. బ్లాక్ వైస్ పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ, ఆర్అండ్బీ అధికారులను సూచించారు. మంత్రి వెంట ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ లింగారెడ్డి, సత్యనారాయణ, ఈఈ శశిధర్, పలువురు అధికారులు, వాస్తు నిపుణులు తేజ, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.