కోల్కతా: బెంగాల్ మంత్రి పార్ధా ఛటర్జీ సహాయకురాలు అర్పిత ముఖర్జీ ఈడీ అధికారులకు కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో ప్రస్తుతం మంత్రి పార్ధా, అర్పితను ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అర్పిత ముఖర్జీ ఇంట్లో నుంచి 21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి పార్ధా తన ఇంట్లో ఉన్న ఓ రూమ్లోనే డబ్బును మొత్తం దాచాడని అర్పిత తెలిపింది. ఆ రూమ్లోకి కేవలం పార్ధా మనుషులు మాత్రమే వెళ్లేవారని విచారణలో పేర్కొన్నది. తన ఇంటికి మంత్రి పార్ధా వారానికి ఓ సారి లేదా పది రోజులకు ఓసారి వచ్చేవారని అర్పిత చెప్పింది. తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా మినీ బ్యాంక్లా మంత్రి పార్ధా వాడుకున్నట్లు తెలిపింది. మరో మహిళ కూడా మంత్రి పార్ధాకు సన్నిహితురాలని అర్పిత వెల్లడించింది.
రూమ్లో ఎంత సొమ్ము ఉందో మంత్రి ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నది. ఓ బెంగాలీ నటుడు తనను మంత్రి పార్ధాకు పరిచయం చేయించాడని, 2016 నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు ఆమె చెప్పారు. ట్రాన్స్ఫర్లు, కాలేజీ గుర్తింపు కోసం ఇచ్చిన లంచాలదే ఆ డబ్బు మొత్తం అని ఆమె తెలిపింది. కానీ ఆ డబ్బును మంత్రి ఎప్పుడూ తీసుకురాలేదని, అతని మనుషులు మాత్రమే తెచ్చేవారని ఆమె చెప్పింది.
మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు అర్పిత ముఖర్జీకి ఇవాళ కోల్కతాలను ఈఎస్ఐ ఆస్పిటల్లో మెడికల్ పరీక్ష చేయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి 48 గంటలకు మెడికల్ చెకప్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 3వ తేదీ వరకు ఇద్దరూ ఈడీ కస్టడీలో ఉండనున్నారు.