హైదరాబాద్ : స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్ఎంసీతోనే కాదని.. ప్రజలు సైతం భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని నెక్లెస్రోడ్లో 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ స్వచ్ఛత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వచ్ఛతను, పారిశుధ్యాన్ని ఒక ప్రాధాన్యంగా తీసుకొని 2015లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2,500 స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరో 650 కొత్త స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఇందులో ఇవాళ 325 ఆటోలను నగరంలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కలిసి ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్త సేకరణ కోసం పంపిణీ చేసి బుట్టలను వినియోగం తెచ్చి ఇండ్ల వద్దకు వచ్చే ఆటో డ్రైవర్లకు అందజేయాలని కోరారు. నగర స్వచ్ఛతకు కృషి చేస్తున్న జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని, అధికార యంత్రాంగం, సిబ్బంది మంత్రి అభినందించారు. అలాగే శానిటేషన్పై మరింత దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో మరింత స్వచ్ఛత వసరమన్నారు. లాక్డౌన్ సమయంలో సమర్థవంతంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపట్టిందని.. మరోసారి ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అవసరమైతే మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.