హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ర్టానికి ప్రత్యేకంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం కూడా ఉన్నదని తెలిపారు. ‘3డీ ప్రింటింగ్’లోనూ రాష్ట్రం ముందువరుసలో ఉన్నదని చెప్పారు. నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఎన్సీఏఎం), తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సంయుక్తంగా శుక్రవారం హైదరాబాద్లో ‘3డీ ప్రింటింగ్ ఇన్ మెడికల్ డివైజెస్ అండ్ ఇంప్లాంట్’ సదస్సు నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో సుమారు 20 కంపెనీలు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, ఎన్సీఏఎంతో ఎంవోయూలు కుదుర్చుకొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. త్రీడీ ప్రింటింగ్పై ఇలాంటి సదస్సు దేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. తెలంగాణ ఇప్పటికే స్టార్టప్లకు అత్యంత అనుకూల రాష్ట్రంగా, ఆవిష్కరణల కేంద్రంగా కొనసాగుతున్నదని తెలిపారు. టీ హబ్, వీ హబ్, టాస్క్, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్, టీ వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఇమేజ్ ఎక్సలెన్స్ సెంటర్ వంటివన్నీ తెలంగాణను స్టార్టప్ ఎకోసిస్టమ్గా మార్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,500లకుపైగా స్టార్టప్లు ఉన్నాయని, వీటికి గత ఐదేండ్లలో రూ.1,800 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.
3డీ ప్రింటింగ్ మెడికల్ ఇంప్లాట్ల రంగంలో అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్రీడీ ప్రింటెడ్ ఇంప్లాంట్లు సహజ ఎముక మాదిరిగా స్థిరత్వాన్ని, కదలికలు ఇస్తూ సమర్థంగా పనిచేస్తాయని చెప్పారు. క్లిష్టమైన ఎముకల రూపాల్లోనూ ఇంప్లాంట్లను తయారు చేయవచ్చని, తద్వారా డాక్టర్లకు పని మరింత సులభం అవుతుందని వివరించారు. ప్రస్తుతం రోగి అవసరాలకు తగినట్టుగా తయారుచేసే ‘పేషెంట్ స్పెసిఫిక్’ ఇంప్లాంట్లకు డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు.
ముఖ్యంగా ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో డిమాండ్ భారీగా ఉన్నదని, దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇంప్లాట్లను తయారుచేసి, నిల్వ చేయడం వంటి వృథా తగ్గుతుందని పేర్కొన్నారు. గతంలో అమెరికా, ఐరోపా దేశాలకే పరిమితమైన ఈ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. హెల్త్కేర్ 3డీ ప్రింటింగ్ ఇంప్లాట్ల మార్కెట్ 2020 నాటికి సుమారు రూ.14వేల కోట్లు ఉండగా, 2027 నాటికి రూ.55 వేల కోట్లు దాటే అవకాశం ఉన్నదని చెప్పారు.
ఈ రంగం ఏటా 22.3 శాతం వృద్ధి సాధిస్తున్నదని, దీనిని అందిపుచ్చుకొని భారతదేశం మార్కెట్ లీడర్గా, గేమ్ చేంజర్గా ఎదిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఫార్మా కంపెనీలు 3డీ ప్రింటింగ్ సాయంతో ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయని, దీంతో కంపెనీలకు రూ.కోట్లు ఆదా అవుతున్నాయని తెలిపారు. సదస్సులో అత్యాధునిక టెక్నాలజీలను పరిచయం చేయడంతోపాటు ప్రస్తుత ట్రెండ్స్, మార్కెట్ అవసరాలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర దక్షిణాసియా కమిషనర్ (గ్లోబల్ విక్టోరియా) మిచెల్లీ వేడ్, రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఓఎస్డీ రమాదేవి లంక, ఎన్సీఏఎం సీఈవో జస్ప్రీత్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
వైద్య పరికరాల 3డీ ప్రింటింగ్ దశాబ్దం కిందటే మొదలైందని, టీ వర్క్స్ ఇప్పటికే 3డీ ప్రింటింగ్పై పనిచేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ సమయంలో వివిధ కంపెనీలతో కలిసి ‘మెకానికల్ వెంటిలేటర్ల’ను తయారు చేసిందని గుర్తు చేశారు. టీ వర్క్స్ త్వరలో 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించనున్నదని, ఇందులో 3డీ ప్రింటింగ్ కోసం ప్రత్యేకంగా ఒక ల్యాబ్ ఉంటుందని చెప్పారు. 3డీ ప్రింటింగ్ రంగంలో మరిన్ని ఆవిష్కరణలపై దృష్టి సారించామని, ఈ క్రమంలో వివిధ పరిశ్రమలతో ఒప్పందం చేసుకొంటున్నామని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్సీఏఎం ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.