హైదరాబాద్ : క్రిస్టియన్స్ కు సంబంధించిన శ్మశాన వాటికల (బరియల్ గ్రౌండ్ ) ఏర్పాటు కోసం నగరం చుట్టుపక్కల ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లో మైనార్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నగరం చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలలో 10 చోట్ల సుమారు కోట్ల రూపాయల విలువ చేసే 60ఎకరాలు కేటాయించడాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ శ్మశాన వాటికల ముందు ‘క్రైస్తవ స్మృతి వనం’ అని బోర్డు పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. వాటి చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. వాచ్ మెన్ నియమించాలని, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించి లైట్లు బిగించాలని అధికారులను మంత్రి కొప్పుల ఆదేశించారు.
అదేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. మంత్రి వెంట మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.