హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ)/నారాయణఖేడ్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రులు టీ హరీశ్రావు, జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని నిలదీశారు. మంగళవారం మంత్రి హరీశ్రావు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి శుద్ధ అబద్ధాలతో, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పీయూష్గోయల్ అధికారికంగా లేఖ ఇవ్వగా, కిషన్రెడ్డి మాత్రం ఉప్పుడు బియ్యం కొనుగోలు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గోయల్ ఇచ్చిన లేఖ వాస్తవమా? కిషన్రెడ్డి చెప్పే మాటలు నిజమా? ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో తేల్చాలని డిమాండ్ చేశార
ఒకవేళ ఉప్పుడు బియ్యం కొంటే ఎంత కొంటారో స్పష్టం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని పేర్కొన్నారు. స్పష్టత ఇవ్వకుండా ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ వరి కొనుగోళ్లపై అనవసర రాద్ధాంతం చేయడమేమిటని ప్రశ్నించారు. ధాన్యంలో తేమ శాతం 17కు తక్కువగా ఉండాలన్న కేంద్ర నిబంధన కారణంగా రైతులు ఆరబెట్టి తీసుకొస్తున్నారని, దీంతో కొనుగోళ్ల ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతున్నదని వివరించారు. తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే హక్కు బీజేపీకి ఎక్కడిదని నిలదీశారు. కాంగ్రెస్ హయాం లో పదేండ్లలో కొనుగోలు చేయనంత ధాన్యాన్ని తమ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే కొనుగోలు చేసిందని హరీశ్రావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ లేదా కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్లో చర్చ పెట్టాలని, చర్చించడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని అన్నారు. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, కిషన్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు బెంగళూరు వెళ్తున్న ఆయన మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల భావోద్వేగమే సీఎం కేసీఆర్ ఆవేశంగా ప్రతిధ్వనించిందని చెప్పారు. సంవత్సర ప్రణాళికను విడుదలచేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేయడం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. కేసీఆర్ ప్రెస్మీట్పై స్పందించాల్సింది ఈ చిల్లరమల్లరగాళ్లు కాదన్నారు. భాష గురించి బండి సంజయ్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తారా? లేదా? అన్నదానిపై బీజేపీ నాయకులు ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని నిలదీశారు. అసలు దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న సోయి కేంద్రానికి ఉన్నదా? అని ప్రశ్నించారు. మోదీ సర్కార్ ప్రవేశపెడుతున్న దుర్మార్గ విద్యుత్తు చట్టంపై అన్ని అంశాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని పేర్కొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.