చార్మినార్, డిసెంబర్ 23: మహా నగరంలోని నెహ్రూ జూ పార్క్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పలు ఎన్క్లోజర్లను గురువారం ప్రారంభించారు. జూలో కొత్తగా ఏర్పాటు చేసిన పక్షుల ప్రపంచంతో పాటు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వేట కుక్కలను సందర్శకులను అలరించనున్నాయని తెలిపారు. సందర్శకులను అలరించడానికి జూ మరింతగా ముస్తాబు సంతరించుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి తెలిపారు. జూ పార్క్లో నూతనంగా తీర్చిదిద్దిన ప్యారెట్ వరల్డ్ను ఆయన ప్రారంభించారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ జూ పార్క్ నగర సిగలో మకుటాయమానంగా ఒదిగిపోయిందన్నారు. దానికి మరింత వన్నె చేకూర్చడానికి జూ పార్క్ను మరింత సుందరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్యారెట్ వరల్డ్ ఒకటని తెలిపారు. కొత్తగా రూపాంతరం చెందిన ఈ గ్యాలరీలో 36 ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. పక్షుల ప్రపంచంలో అడుగు పెట్టగానే వాటర్ ఫౌంటెన్లు, పూదోటలు, కిలకిల రావాలు స్వాగతం పలుకుతాయని, వివిధ రాష్ర్టాల్లోని చూడముచ్చటైన పక్షులు, వాటితో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఆమెరికా దేశాల నుంచి ప్రత్యేకంగా దిగుమ తి చేసుకున్న పక్షులు సందర్శకులను మరో లోకం లో విహరింపజేస్తాయని తెలిపారు.
పక్షి ప్రపంచం లో మొత్తం 60 జంటలతో 680 పక్షులు పర్యాటకులను అలరించనున్నాయని తెలిపారు. పక్షుల ప్రపంచాన్ని అధునీకరించడానికి కోటి 33 లక్షల నిధులతో అద్భుతమైన పక్షుల రాజ్యాన్ని ఏర్పా టు చేశామని తెలిపారు. సఫారి పార్క్లో ప్రయాణించడానికి కొత్తగా వచ్చిన ఏసీ బస్సులకు జెం డా ఊపి మంత్రి ప్రారంభించారు. జూలో కొత్తగా వైల్డ్డాగ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వైట్ టైగర్ సమీపంలో అభివృద్ధి పర్చిన ఎన్క్లోజర్లోకి మంత్రి జెండా ఊపి వైల్డ్ డాగ్లను ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు.
చార్మినార్, డిసెంబర్ 23: నెహ్రూ జులాజికల్ పార్క్ మరో ఘనతను సాధించిందని జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు. సందర్శకులకు అందిస్తున్న సౌకార్యలతో పాటు పర్యావరణ హితంగా జూ పార్క్ను తీర్చిదిద్దినందుకు గాను 2020-2021వ సంవత్సరానికి ఐఎస్ఓ 9001-2015 సర్టిఫికెట్ను సాధించిందన్నారు. దేశంలోనే ప్రధమంగా సర్టిఫికెట్ సాధించిన ఘనతగా నెహ్రూ జూ పార్క్కే దక్కిందని క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు.
జూ సందర్శకుల రక్షణకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నాం. పర్యాటకుల రక్షణ కోసం జూ పార్క్లో 200 సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇక ప్రతి ఎన్క్లోజర్ను నిశితంగా పరిశీలించవచ్చు. కేంద్ర జూ అథారిటీ భాగస్వామ్యంతో 60:40 నిష్పత్తిలో కోటి 66 లక్షలు కేటాయించాం.- మంత్రి ఇంద్రకరణ్రెడ్డి