హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల మార్పిడి ఆలోచనకు తెలంగాణ ఆగ్రోస్ ఊతమిస్తున్నది. వరికి బదులుగా చిరుధాన్యాలు పండించే రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజేంద్రనగర్లోని మిల్లెట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఆగ్రోస్ ఆధ్వర్యంలో రైతుల నుంచి నేరుగా చిరు ధాన్యాలను సేకరించి, వినియోగదారులకు విక్రయించేందుకు నిరుద్యోగ యువతతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లెట్ స్టాల్స్ను ఏర్పాటు చేయించాలని ఆగ్రోస్ సంకల్పించింది. తొలిదశలో రాగి, కొర్రలు, జొన్నలపై ఆగ్రోస్ దృష్టి పెట్టింది. ఈ మూడు పంటలను రైతులతో సాగు చేయించి ఆగ్రోస్ కొనుగోలు చేస్తుంది. ఆగ్రోస్ కొనుగోలు చేసిన చిరుధాన్యాలను మిల్లెట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేస్తుంది.
వినియోగదారులకు ఆరోగ్యం, రైతుకు ఆదాయం
ప్రభుత్వం పంటమార్పిడికి పిలుపు ఇవ్వడం, కరోనా నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం ప్రోత్సహించే దిశగా దృష్టి సారించాం. రైతులకు భరోసా ఇచ్చేందుకు, వినియోగదారులకు నాణ్యమైన మిల్లెట్స్ను అందించేందుకు ఆగ్రోస్ ఆధ్వర్యంలోనే చిరుధాన్యాల మార్కెటింగ్లోకి ప్రవేశిస్తున్నాం. ఇందుకు మిల్లెట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్తో ఒప్పందం చేసుకున్నాం. రైతులకు మంచి ధర, కొనుగోలు భరోసా దక్కడంతో మిల్లెట్స్ సాగు చేసేందుకు చాలామంది ముందుకొస్తారు.