అమీర్పేట్, నవంబర్ 22: మహా నగరంలోని మెట్రో రైల్ ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ, రైల్ వాడకం మెరగవుతోందని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. కోవిడ్ అనంతర పరిణామాల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో అమలు చేస్తున్న ‘సువర్ణ స్కీమ్’కు చక్కటి ఆదరణ లభిస్తోందన్నారు. సువర్ణ స్కీమ్ కార్డు ద్వారా 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లిస్తే.. మెట్రోరైల్ అదనంగా 10 ట్రిప్పులు ఉచితంగా ఇస్తుంది. దీంతో 20 ట్రిప్పుల డబ్బులకే 30 ట్రిప్పులు పొందేలా ప్రయాణికులకు చక్కటి పధకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 18 నుంచి 30వ తేదీ వరకు 40 వేల మంది ప్రయాణికులు ఈ పధకాన్ని వినియోగించుకున్నారు.
ఈ పథకాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లక్కీ డ్రా ద్వారా కార్డు కొనుగోలు చేసిన ఐదుగురిని ఎంపిక చేశారు. వారికి సోమవారం సాయంత్రం అమీర్పేట్ మెట్రోరైల్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన ఎర్రం రాజశేఖర్, మౌనిక, పీవీ శ్రీకాంత్, రాజశేఖర్రెడ్డి, శ్రీబిందులు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చేతల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైళ్ళలో ప్రస్తుతం రోజూ 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, త్వరలోనే ఈ సంఖ్య 4 లక్షలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టీ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తి తదనంతర పరిస్థితుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే మన మెట్రోరైల్ మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు.