నర్సంపేట, ఫిబ్రవరి 23: ఏపీలోని శ్రీకాకుళంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం ముమ్మాటికీ నిజమేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో 30 వేల వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు పూర్తయినట్టు ఆయన తెలిపారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడంలేదని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని రుజువైందని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బుధవారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట, గార మండలాల్లోని గోపాలపెంట, శ్రీకూర్మం తదితర గ్రామాల్లో పర్యటించారు. వ్యవసాయ మోటర్లకు బిగించిన మీటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మీటర్ల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కుట్రతో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించిందని, దీనివల్ల రైతులు ఉచిత కరెంట్ సౌకర్యాన్ని కోల్పోనున్నారని తెలిపారు. మీటర్ల బిగింపుతో విద్యుత్తు బిల్లులు రైతులకు భారంగా మారనున్నాయని చెప్పారు. ఆయా గ్రామాల్లో 30 వేల వ్యవసాయ కనెక్షన్లకు కరెంటు మీటర్లు బిగించే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీలను తీసేసి ఉచిత కరెంటు ఆపేసి రైతన్నల నడ్డిని విరిచేందుకే కేంద్రం కుట్రలు పన్నిందని పునరుద్ఘాటించారు. శ్రీకాకుళంలో బిగించిన మీటర్లపై వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించే కేంద్ర ప్రభుత్వానికి త్వరలో మనమే మీటర్లు బిగిద్దామని రైతులకు పిలుపునిచ్చారు.