Meta | సాధారణ ఎన్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) షాకిచ్చింది. తమ ఇన్స్టాగ్రామ్ (Instagram), థ్రెడ్స్ (Threads) ప్లాట్ఫామ్స్లో ఇకపై పొలిటికల్ కంటెంట్ను రికమెండ్ చేయబోమని ప్రకటించింది. అంతేగాక ఫేస్బుక్లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్ కంటెంట్కి కళ్లెం వేస్తామని చెబుతోంది.
కాగా, ఫేస్బుక్, ఇన్స్టా, థ్రెడ్స్ ప్లాట్ఫామ్లలో తప్పుడు సమాచారం, డీప్ఫేక్ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్ఫామ్లలో పొలిటికల్ కంటెంట్ను రికమెండ్ చేయబోమని ప్రకటిచింది.
అయితే రాజకీయ కంటెంట్ను ఇష్టపడేవారికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్ను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించే వారికి తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నాని, అందుకే ఫాలోకాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్ను ముందస్తుగా సిఫార్సు చేయబోమని చెప్పింది. ఈ విషయాన్ని ఇన్స్టా హెడ్ ఆడమ్ మోస్సేరి కూడా థ్రెడ్స్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రాజకీయ నాయకులకు సోషల్ మీడియా బలమైన వేదికగా ఉంది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే అనువుగా మారింది. ఈ విషయంలో ఫేస్బుక్, ఇన్స్టా ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కానీ, మెటా తాజా నిర్ణయంతో ఆయా ప్లాట్ఫామ్లలో పొలిటికల్ కంటెంట్ అందిరికీ చేరదు. పొలిటికల్ అకౌంట్లు, పేజీలను ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్ చేరుతుంది. ఎన్నికల వేళ మెటా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు షాకే అని చెప్పవచ్చు.