చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రస్తుతం చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. శ్రీలంక-వైజాగ్ బ్యాక్డ్రాప్లో జాలర్ల జీవితాలతో ముడిపడి ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. ఇందులో వాల్తేరు వీరయ్య అనే మత్స్యకారుడిగా చిరంజీవి పాత్రచిత్రణ మాస్ కోణంలో విభిన్నంగా ఉంటుందని తెలిసింది. ఆయనకు జోడీగా శృతిహాసన్ను కథానాయికగా తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘గాడ్ఫాదర్’, ‘భోళాశంకర్’ చిత్రీకరణను జరుపుకుంటున్నాయి.