క్యాన్సర్ సోకిందని తెలియగానే చాలామంది భయ పడిపోతారు. రోజులు దగ్గరపడ్డాయన్న చింతతో చిక్కి శల్యమైపోతారు. కానీ, అదేం ప్రాణాంతక వ్యాధి కాదనీ, ధైర్యంగా చికిత్స తీసుకుంటూ పోషకాహారం తింటే సులభంగా జయించవచ్చనీ ధైర్యం చెబుతున్నది ఢిల్లీ యువతి అంచల్ శర్మ.
ఆ సమయంలో అంచల్ శర్మ తన తమ్ముడి పెండ్లి పనుల్లో బిజీగా ఉంది. అంతలోనే, ఒంట్లో నలత. వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. ఏవో పరీక్షలు చేశారు. రొమ్ము క్యాన్సర్ అని నిర్ధారించారు. ‘ఆ క్షణమే నేను కుంగిపోయి ఉంటే.. ఈ రోజు వందలాది క్యాన్సర్ రోగులకు భరోసా ఇవ్వగలిగేదాన్నే కాదు’ అంటున్నది అంచల్. 37 ఏండ్ల వయసులోనే అంచల్కు క్యాన్సర్ సోకింది. ఆ బాధలోంచే ధైర్యం పుట్టుకొచ్చింది. అదే జీవితంపై ఆశను పెంచింది. అందుకే, కీమో థెరపీలు శరీరాన్ని కాల్చేస్తున్నా చిరునవ్వుతో భరించింది. తనతో పాటు చికిత్స కోసం వచ్చే రోగులకు స్ఫూర్తినిచ్చే కథలు చెబుతూ, నవ్విస్తూ, అవగాహన కల్పిస్తూ ధైర్యం నూరి పోసింది.
తనకు క్యాన్సర్ తగ్గుముఖం పట్టడంతో, తోటి రోగుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. థెరపీ సమయంలో ధరించడానికి మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి డ్రెస్ లేకపోవడాన్ని గమనించింది. పోషకాహార లోపంతో బాధపడేవారిని దగ్గర నుంచీ చూసింది. ఆ అనుభవాల ప్రభావంతోనే ‘కెన్ హీల్’ను స్థాపించింది. ఆ సంస్థ ద్వారా కీమో సమయంలో వేసుకునేందుకు వీలుగా ప్రత్యేక దుస్తులు డిజైన్ చేసింది. సౌందర్య సంరక్షణ కోసం ఆర్గానిక్ క్రీములు, షాంపూలు, సబ్బులు, ఇతర ఉపకరణాలు తయారుచేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నది. దగ్గర్లోని క్యాన్సర్ ఆస్పత్రులకు, బాధితుల ఇండ్లకు వెళ్లి ధైర్యం చెబుతున్నది.