కొండాపూర్, డిసెంబర్ 17 : మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ప్రముఖ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య బృందం ‘మీనాక్షి కల్యాణం’ పేరిట ప్రత్యేక నృత్యరూపకాన్ని శుక్రవారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి, నాట్య గురువులు పసుమర్తి రామలింగయ్య శాస్త్రి, త్రివిక్రమ్ శ్రీనివాస్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీనాక్షి కల్యాణ నృత్యరూపక ప్రదర్శనలో పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన గొడవ, పార్వతీదేవి మీనాక్షి అవతారంలో పరమేశ్వరుడిని చేరుకుని మనువాడే వరకు సౌజన్య తన బృందంతో కలిసి ప్రదర్శించిన కూచిపూడి నృత్యరూపకం సందర్శకులను ఆధ్యాంతం ఆకట్టుకుంది. సౌజన్యతో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, పలువురు కళాకారులు పాల్గొని నృత్య ప్రదర్శనలిచ్చారు.