హైదరాబాద్, జనవరి 24 : మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించి, తగినన్ని నిధులు ఇవ్వాలని, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను సాధించిన తర్వాతే మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయనకు సవివరమైన ట్వీట్ చేశారు. మేడారం జాతరపై కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిలదీశారు. ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ వేదిక కావడం మనందరికీ గర్వకారణమన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మేడారం జాతరకు రూ.332.71 కోట్లు విడుదల చేసి మూడుసార్లు వైభవంగా నిర్వహించారని గుర్తుచేశారు. వచ్చేనెల 16 నుంచి 19 వరకు నాలుగోసారి జరిగే జాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నదని తెలిపారు. లక్షల మంది హాజరయ్యే ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి నయాపైసా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని అనేకసార్లు కోరినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలన్న అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని సంజయ్ని నిలదీశారు. మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన లేఖలను ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్కు జతచేశారు.