సమస్యలుంటే నేరుగా సంప్రదించవచ్చు
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
అక్రమ వ్యాపారాలపై నిఘా..
మెదక్లో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం..
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు
మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్, డిసెంబర్ 28 : జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను మెదక్ ఎస్పీగా రావడం సంతోషంగా ఉందన్నారు. మెదక్ జిల్లాలో క్రైం రేట్ తగ్గిస్తామని, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా సంప్రదించి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చూడాలన్నారు. సమస్యలు పెండింగ్లో లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ముఖ్యంగా మెదక్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నందున పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేశామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. తూప్రాన్ సబ్ డివిజన్లో భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. రౌడీయిజం చేస్తే వెంటనే బైండోవర్ చేస్తామన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
జిల్లాలో పరిధిలోని జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా తూప్రాన్, మనోహరాబాద్, కాళ్లకల్, చేగుంట, రామాయంపేట రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తూప్రాన్ డివిజన్లో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. సైబర్ క్రైంపై ప్రజలకు అవగాహన కల్పించి, చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజావాణి ద్వారా తమ సమస్యలు తెలుపవచ్చన్నారు.
అక్రమ వ్యాపారాలపై నిఘా..
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా వేస్తామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఇసుక, మట్టి, డ్రగ్స్ తదితర వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అక్రమ వ్యాపారాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం కేసీఆర్ అక్టోబర్లో నిర్వహించిన సమావేశంలో డ్రగ్స్, ఎండు గంజాయి వినియోగం, రవాణాపై నిఘా పెట్టాలని దిశానిర్దేశం చేశారని, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో షీటీం పని చేస్తున్నదని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులున్నా, సమాచారమిస్తే వెంటనే స్పందిస్తారని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు సైదులు, కిరణ్కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు నాగేశ్వర్రావు, సురపునాయుడు, పట్టణ సీఐ వెంకట్, రూరల్ సీఐ పాలవెల్లి, తూప్రాన్ సీఐ స్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.