మునిపల్లి/పుల్కల్, మే 21: మరిది చేతిలో వదిన హత్యకు గురైన ఘటన పుల్కల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బుసారెడ్డిపల్లి గ్రామ శివారులో గల సింగూర్ ప్రాజెక్టులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం పెద్ద అమ్రాది కలాన్ గ్రామానికి చెందిన సంగమని (45) ఈ నెల 17నుంచి కనబడుట లేదని మృతురాలు మరిది శ్రీనివాస్ మోమిన్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. మోమిన్పేట్ పోలీసులు శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మం డల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద తనిఖీలు చేపట్టారు. సంగమని మృతదేహం ఓ సంచిలో కట్టి ప్రాజెక్టులో పడేసినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న సంగమని కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం సింగూర్ ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకున్నారు. భూ తగాదలతోనే సంగమని మరిది శ్రీనివాస్ హత్య చేసి సింగూర్ ప్రాజెక్టులో పడేశాడని, కనిపించడం లేదంటూ మోమిన్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడని కుటుంబీకులు ఆరోపించారు. పెద్ద అమ్రాది కలాన్ గ్రామంలో సంగమనికి ఆరెకరాలు భూమి ఉన్నదని, ఎలాగైనా భూమిని దక్కించుకోవాలన్న ప్రయత్నంలో వదినను హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. గతంలో చాలాసార్లు సంగమనిని ఇష్టానుసారంగా కొట్టి, తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలజీ పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.