ఝరాసంగం, అక్టోబర్ 22: ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉదోగ్యం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. చదువుకున్న యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి జల్సాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి యువకులకు జీవనోపాధి కల్పిస్తున్నది. చదువుకున్న యువత కొందరు సొంత కాళ్లపై నిలబడాలని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగపర్చుకుంటున్నారు. మండల పరిధిలోని ఎల్గొయి గ్రామానికి చెందిన రవికుమార్ కులకర్ణి సొంత ఊరిలో తనకున్న ఐదెకరాల్లో రెండు ఎకరాల్లో పశుగ్రాసం, మిగతా మూడెకరాల్లో అంతర పంటలు సాగు చేసుకుంటున్నారు. వ్యవసాయ పొలం వద్ద పశువుల షెడ్డు వేసి వాటితో ఏడాదికి రూ. 20 లక్షల వరకు లాభం పొందుతున్నాడు. ఆయనతో పాటు నలుగురికి ఉపాధిని చూపుతున్నాడు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులపై ప్రత్యేక కథనం..
ఉన్న ఊరిలో స్వయం ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు నిరుద్యోగ యువత. నేటి సమాజంలో వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించక సరైన దిగుబడులు రాక పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితి. దీంతో కొందరు రైతులు వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని సొంత గ్రామం విడిచి వెళ్లలేక ఉన్న ఊరులోనే స్వయం ఉపాధి సాగిస్తూ అధిక లాభాలు పొందుతూనే ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానికంగా గ్రామంలో ఒక ఎకరం, రెండు ఎకరాల పొలం ఉంటే చాలు పశువులు, కోళ్ల పెంపకం సాఫీగా కొనసాగించవచ్చునని నిర్వాహకులు చెబుతున్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి, కోళ్ల పెంపకంతో మంచి లాభాలు వస్తుండడంతో మక్కువ చూపుతున్నారు.
నలుగురికి ఉపాధి..
నాకున్న ఐదు ఎకరాల భూమిలో పశువుల షెడ్డు నిరాణాన్ని చేపట్టాను. షెడ్డు నిర్మాణానికి రూ.30 లక్షల ఖర్చు వచ్చింది. 20 పాడి పశువులను తెచ్చాను. 45 రోజులకు రూ. లక్షా 75 వేల ఆదాయం వస్తుందన్నారు రవికుమార్ కులకర్ణి. పశువుల షెడ్డుతో వ్యవసాయనికి సేంద్రియ ఎరువులు పొలానికి వేస్తున్నాం. అంతేకాకుండా పేడ విక్రయిస్తున్నాం. ప్రజలకు స్వచ్ఛమైన పాలు, పెరుగు అందిస్తున్నాం. ఊరిలోనే కాకుండా జహీరాబాద్ పట్టణ ప్రజలకు సైతం పాలు, పెరుగు ప్రతి రోజూ తీసుకు వెళ్లి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాం.
ఏడాది కో సారి మార్పిడి..
గ్రామాల్లో కొంత మంది రైతులు పాడి కోసం కాకుండా చిన్న, చిన్న దుడ్డెలను తీసుకువచ్చి పెద్దవి కాగానే వాటిని ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు పొందుతున్నారు. పాడి పశువులతో పాటు ఇలాంటి పద్ధతి ద్వారా కూడా మంచి లాభాలు పొందువచ్చునని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పాడి గేదెలను ఏడాదికి ఓ మారు మార్పిడి చేస్తున్నాం. ఒక క్రాప్ బర్రెలను పెంచడానికి నిర్వహణ ఖర్చు నెల వారి ఖర్చు రూ. 40 వేల వరకు వస్తుందని ఆదాయం రూ. 80 వేల వరకు వస్తుందన్నారు.
నిరుద్యోగులకు రుణ సదుపాయం
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు మా రుణ సదుపాయం కల్పించేందుకే డీసీసీబీ బ్యాంక్ పని చేస్తున్నది. యువకులు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరాశ పడుకుండా మేము సైతం అంటూ స్వయం కృషితో ముందుకు వచ్చే వారికి భరోసా కల్పిస్తున్నది. మా బ్యాంక్తో పాటు వ్యసాయ ప్రాథమిక సహకార సంఘం అనుసంధానంతో రూ. 8 లక్షలు ఇచ్చాం. రుణం పొందిన రవికుమార్ కులకర్ణి ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ బ్యాంకు రుణం వాయిదాల ప్రకారం చెల్లిస్తున్నారు.
కలిమొద్దీన్, డీసీసీబీ మేనేజర్ ( ఝరాసంగం )
స్థానికంగా ఉపాధి సంతోషానిచ్చింది..
ఎంఏ, బీఎడ్ వరకు చదువుకున్నా. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించుకున్నా. కొంత మంది పెద్దలు చెప్పడంతో నాబార్డు మేనేజర్ను సంప్రదించా. ఆయన మా గ్రామానికి వచ్చి షెడ్ నిర్మాణం చేసుకున్నట్లయితే పశువులు తెచుకునేందుకు రుణం మంజూరు చేయిస్తామన్నారు. ఝరాసంగంలోలోని జిల్లా సహకార సంఘం పరపతి బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లగా షెడ్డు నిర్మాణానికి రుణ సదుపాయం కల్పించారు. నాతో పాటు నలుగురికి ఉపాధిని చూపుతున్నా. ఎంతో ఆనందంగా ఉంది.
-రవికుమార్, కులకర్ణి ,ఎల్గొయి ( గ్రామస్తుడు)