నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10న జరుగగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో మంగళవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలుగా వేరు చేశారు. అనంతరం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించగా గంటలోపే ఫలితం స్పష్టమైంది. పోలైన 1,233 ఓట్లలో 1,183 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. మరో 50 ఓట్లు చెల్లలేదు. దాంతో చెల్లిన ఓట్లలోంచి గెలుపు కోటాగా 583 ఓట్లను నిర్ధారించారు. మొత్తం చెల్లిన ఓట్లల్లో మంకెన కోటిరెడ్డికి 917 ఓట్లు పోలయ్యాయి. దాంతో కోటిరెడ్డికి గెలుపు కోటాను మించి 334ఓట్లు అదనంగా వచ్చాయి. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కోటిరెడ్డి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు.
స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కుడుదుల నగేశ్కు 226 ఓట్లు, వంగూరి లక్ష్మయ్యకు 26ఓట్లు, ఏర్పుల శ్రీశైలానికి 3ఓట్లు, కాసర్ల వెంకటేశ్వర్లుకు 6ఓట్లు, కొర్రా రాంసింగ్కు 5ఓట్లు రాగా మరో స్వతంత్ర అభ్యర్థి బెజ్జం సైదులుకు ఓట్లేమీ రాలేదు. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి 691 ఓట్ల భారీ మెజార్టీతో కుడుదుల నగేశ్పై గెలుపొందినైట్లెంది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి మొత్తం 266 ఓట్లు పోలయ్యాయి. 2019మొదట్లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి వచ్చిన మెజార్టీ భారీగా ఉన్నది. గత ఎన్నికల్లో మొత్తం 1073 ఓట్లు పోలుకాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డికి 640, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు రాగా టీఆర్ఎస్ 226 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. కానీ ఈ సారి మెజార్టీ మూడింతలు పెరుగడం విశేషం.
వాస్తవ ఓట్ల కంటే అదనంగా…
వాస్తవంగా టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో మొత్తం 820 మంది ఓటర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 384, బీజేపీ 35, వామపక్షాలు 23, ఇతరులు తొమ్మిది మంది ఉన్నారు. కానీ, టీఆర్ఎస్కు ఉన్న వాస్తవ ఓట్ల కంటే అదనంగా 97 రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తనకున్న వాటిల్లో 118 ఓట్లను కోల్పోయినైట్లెంది. కాంగ్రెస్ పెద్దల తీరు కారణంగా పార్టీలో నెలకొన్ని గందరగోళ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి మంత్రాంగం ఫలించింది.
ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహం..
ఎన్నికల్లో ఆది నుంచీ టీఆర్ఎస్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగింది. అభ్యర్థి ఖరారు కాగానే జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేశారు. భారీ విజయమే లక్ష్యంగా జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లతో పాటు ఇతర ముఖ్యుల సహకారంతో ముందుండి పార్టీని నడిపించారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నేరుగా ఓటర్లతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ వైఖరి, ఇతర పార్టీల ఓటర్లను కలుపుకొని రావడంలో తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలను, జడ్పీ చైర్మన్లను, అవసరాన్ని బట్టి ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేస్తూ దిశానిర్దేశం చేశారు. ముందుగా టీఆర్ఎస్ ఓటర్లతో భేటీలు ముగించిన అనంతరం ఇతర పార్టీల్లో అసంతృప్తులపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లలోని నిస్తేజాన్ని గ్రహించి ఆ పార్టీ నేతల తీరుపై గుస్సాగా ఉన్న ఓటర్లను స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యుల సహకారంతో ఇటు వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. వారందరినీ పోలింగ్ కేంద్రాలకు రప్పించి ఓట్లు వేయించుకోవడం వల్లనే అదనంగా 97ఓట్లు టీఆర్ఎస్కు వచ్చాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బకొట్టేందుకు ఈ ఎన్నికలను ప్రధాన అస్త్రంగా వాడుకోవడంలోనూ టీఆర్ఎస్ విజయం సాధించినైట్లెందన్న చర్చ కూడా జోరుగా సాగుతున్నది. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహం ఫలించిందన్న చర్చ నెలకొన్నది.
అభినందనల వెల్లువ…
కోటిరెడ్డి విజయం సాధించిన వెంటనే జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఇతర ముఖ్యనేతలు కొందరు నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రం ఆవరణకు చేరుకున్నారు. ఘన విజయం సాధించిన కోటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ స్వీట్లు తినిపించారు. శాలువాలతో సత్కరించారు. కోటిరెడ్డితో కలిసి ముఖ్యనేతలంతా విజయసంకేతం చూపుతూ సంబురాలు జరుపుకొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఎంసీ కోటిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు బోయపల్లి కృష్ణారెడ్డి, నంద్యాల దయాకర్రెడ్డి, సుంకరి మల్లేశ్గౌడ్, మాలె శరణ్యారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, గాలి రవికుమార్ పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో సంబురాలు
టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయంతో నాయకులు, పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం వద్ద సంబురాలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కోటిరెడ్డి గెలుపొందడంతో ఏజెంట్లు కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చారు. కోటిరెడ్డి విజయం లాంఛనమే అని ముందుగానే నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేవలం పాస్ ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్లు సమాచారం అందగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పటాకులు కాలుస్తూ హంగామా సృష్టించారు.
ఎన్నికల సంఘం నుంచి ధ్రువీకరణ పత్రం వచ్చేందుకు కొంత ఆలస్యం కావడంతో విజేత కోటిరెడ్డి, ఏజెంట్లు కౌంటింగ్ అవరణలోనే ఉన్నారు. కొద్దిసేపటికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్కుమార్, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి కౌంటింగ్ కేంద్రం ఆవరణకు చేరుకున్నారు. కోటిరెడ్డిని ఆలింగనం చేసుకుని స్వీట్లు తినిపించి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, కౌన్సిలర్లు మాదగోని భవానీగణేశ్, ఫర్జానా పర్వత్ ఇబ్రహీం, ఆలకుంట్ల రాజేశ్వరీ మోహన్బాబు పాల్గొన్నారు.