న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ రమేష్ బిధురి తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఎస్పీ నేత, లోక్సభ ఎంపీ డానిష్ అలీ మనస్తాపానికి లోనయ్యారు. బీజేపీ ఎంపీపై చర్యలు చేపట్టని పక్షంలో తాను లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై చర్చ సందర్భంగా డానిష్ అలీపై బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ఉగ్రవాది అంటూ విరుచుకుపడ్డారు.
బిధూరి వ్యాఖ్యలపై తాను లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశానని బీఎస్పీ ఎంపీ తెలిపారు. బిధూరిపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. బిధూరిపై చర్యలు తీసుకుని తన హక్కులను కాపాడనిపక్షంలో లోక్సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతానని పేర్కొన్నారు. లోక్సభ ప్రసంగంలో రమేష్ బిధూరి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, తనను ముస్లిం ఉగ్రవాదిగా సంభోదించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్పీకర్గా మీ నేతృత్వంలో నూతన పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం దురదృష్టకరమని లేఖలో ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా కలత చెందానని స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిధూరి వాడిన పదజాలం ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
Read More :