న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సారథిగా భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అర్ష్దీప్సింగ్, మయాంక్ను రిటైన్ చేసుకున్న పంజాబ్.. వైస్ కెప్టెన్గా ఉన్న మయాంక్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ గత సీజన్లలో కేఎల్ రాహుల్తో కలిసి మయాంక్ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే జట్టు సారథిగా ఉన్న రాహుల్ వేలంలోకి వెళ్లడంతో మయాంక్కు కెప్టెన్గా అవకాశం వచ్చింది. ‘అద్భుతమైన బృందానికి సారథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. జట్టు కెప్టెన్గా అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తా’అని మయాంక్ తెలిపాడు.