ఖిలావరంగల్, డిసెంబర్ 5: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన.. నాడు కాకతీయులు ఏలిన మట్టికోట క్రమక్రమంగా శవాల దిబ్బలతో శ్మశాన వాటికగా మారుతున్నది. కోటను ఆనుకునే శవాలను ఖననం చేస్తుండడంతో ఖిలావరంగల్కు మాయని మచ్చ తెచ్చే ప్రమాదం పొంచి ఉందని పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కప్పుడు శిల్పకళా సంపదతో మణులు, మాన్యాలతో తులతూగే కోటను నేడు కొందరు శవాల దిబ్బగా మారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శవాలను తీసుకొచ్చి నేరుగా కోటపైనే ఖననం చేస్తుండడంతో చారిత్రక ప్రాశస్త్యం మట్టిలో కలిసిపోతున్నని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తెలిసిన వారే ఈ చర్యకు పాల్పడుతుండడం అనేక విమర్శలకు తావిస్తున్నది. మొన్నటి వరకు కోటకు ఆనుకొని శవాలను ఖననం చేసిన ప్రజలు.. ప్రస్తుతం నేరుగా శవాల ఖననం కోటపైకి పాకడం మానవతా వాదులు, ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తున్నది. మట్టి కోట 2.4 కిలో మీటర్ల వ్యాసార్థంతో 7.2 కిలో మీటర్లు శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. ఈ మట్టికోటకు తూర్పు, పడమర ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉండగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంతోపాటు ఉత్తర, దక్షిణంవైపు కూడా ఈ ద్వారాలు కేవలం కాలినడకే పనికి వచ్చేలా నిర్మించారు.
ఇందులో మట్టికోట గర్భంలో ద్వారాలకు అతి సమీపంలో 8 త్రికూటాలయాలు ఉన్నట్లు వాటి ఆనవాళ్లు కళ్ల ముందు దర్శనమిస్తున్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన మట్టికోటను శ్మశాన వాటికగా వినియోగించుకోవడాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే మట్టికోటకు ఈ దుస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మట్టి కోటకు బయటి వైపు చుట్టూరా 80 మీటర్ల వెడల్పుతో ఉన్న అగడ్త(చెరువు) బల్దియా చెత్తతో పూడుకపోయింది. అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలూ ఉన్నాయి. పడమర కోట ప్రధాన ప్రవేశద్వారం నుంచి దక్షిణం వైపు శంభునిపేట మట్టికోట గండి వరకూ.. అదేవిధంగా మట్టి కోట నైరుతి ద్వారం, దక్షిణ ద్వారం, తుర్పు, ఉత్తర ద్వారాల వద్ద చుట్టూ కిలో మీటర్ల మేర ఇప్పటికే సమాధులతో కోట ఆనవాళ్లు కనుమరుగయ్యాయి.
అందాల కోటను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు శవాల దిబ్బలు దర్శనమిస్తుండడంతో ఒకింత అసంతృప్తికి లోనవుతున్నారు. కోటలో ఎక్కడైనా నిర్మాణాలు చేపడితే నిబంధనల పేరిట నోటీసులు జారీ చేసే అధికారులు.. శవాలను ఖననం చేసేందుకు ఏకంగా కోటనే శ్మశాన వాటికగా మార్చుకున్న తీరు వారి అలసత్వానికి నిదర్శనం. గత ప్రభుత్వాలు శ్మశాన వాటికలను కోటకు ఆనుకునే ఏర్పాటు చేయడంతో నాటి నుంచి నేటి వరకూ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న మరికొంత మంది కోటను శ్మశాన వాటికగా మార్చుకొని తవ్వకాలు చేపడుతున్నారు.
చారిత్రక మట్టికోట శవాల దిబ్బగా మారకుండా అన్ని శాఖల అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందుకెళ్తేనే కోటను కాపాడుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు విబేధాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై వస్తే చారిత్రక కోటను కాపాడుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా కోట రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చారిత్రక కోటను శ్మశాన వాటికగా వినియోగించే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలి. ప్రజల్లో కోట ప్రాశస్త్యాన్ని తెలియచేస్తూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సుమారు 80 శాతం మట్టికోట గోరీలు, బొందలతో దర్శనమిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే ఖిలావరంగల్ మట్టికోట శ్మశాన వాటికను తలపించే అవకాశం ఎంతో దూరంలో లేదు. అధికారులు త్వరతిగతిన స్పందించి చర్యలు చేపట్టాలి. అలాగే, కోట సంరక్షణ అనేది అధికారులపై నెట్టివేయకుండా స్థానికులు, ప్రకృతి ప్రేమికులు కూడా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుతున్నారు.