న్యూఢిల్లీ : సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒకప్పుడు ఓ రేంజ్లో ఉండే క్రేజ్ ఇప్పుడు అమాంతం దిగిపోయిందా అనేలా ఓ మ్యాట్రిమోనియల్ ప్రకటన బయటకు వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రం సంప్రదించవద్దని ఓ న్యూస్ పేపర్లో వచ్చిన పెండ్లి ప్రకటనలో స్పష్టంగా పేర్కొనడం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్ను వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్విట్టర్లో షేర్ చేశారు. 24 ఏండ్ల వయసున్న వ్యాపార నేపధ్యం కలిగిన అందమైన అమ్మాయికి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, పారిశ్రామికవేత్త, బిజినెస్మెన్ అయిన అదే కులానికి చెందిన వరుడు కావలెనని న్యూస్పేపర్లో ఇచ్చిన మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్ పేర్కొంది. దయచేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయవద్దని ఈ ప్రకటన చివరిలో స్పష్టంగా పేర్కొనడం పట్ల నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేశారు.
ఐటీ భవిష్యత్ సవ్యంగా కనిపించడం లేదని ఈ యాడ్ను షేర్ చేస్తూ సమీర్ అరోరా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పలువురి దృష్టిని ఆకర్షించగా నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్ట్ అయ్యారు. ఈ ప్రకటనను చూస్తుంటే దేశ భవిష్యత్ ఏమంత ఆశాజనకంగా లేదని ఓ యూజర్ కామెంట్ చేయగా ఐటీ లేకుండా భవిష్యత్ను గొప్పగా ఊహించలేమని మరో యూజర్ రాసుకొచ్చారు. థ్యాంక్ గాడ్..నాకు పదేండ్ల కిందటే పెండ్లయిపోయిందని మరో నెటిజన్ రెస్పాండ్ అయ్యారు.