గుహవాటి: ఫుట్బాల్ దిగ్గజం దివంగత డీగో మారడోనా చోరీకి గురైన చేతి గడియారం లభించింది. దుబాయ్లో తస్కరణకు గురైన వాచీ అస్సాంలో దొరకగా.. దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత వివరాల ప్రకారం.. దుబాయ్లో అర్జెంటీనా ఫుట్బాలర్ మారడోనాకు చెందిన ‘హుబ్లట్’ కంపెనీ అత్యంత విలువైన వాచీ దొంగతనానికి గురయ్యింది. అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డులపై అనుమానం వచ్చింది. శివసాగర్(అస్సాం) జిల్లాకు చెందిన సెక్యూరిటీ గార్డు వాజిద్ హుస్సేన్పై దుబాయ్ పోలీసులు సందేహం వ్యక్తం చేస్తూ సమాచారం ఇచ్చారు. దుబాయ్లో సెక్యూరిటీగా పని చేస్తున్న వాజిద్ వాచీని దొంగతనం చేశాడు. అనంతరం వెంటనే ఉద్యోగం మానేస్తే అనుమానం వస్తుందని భావించి కొన్నాళ్లు అక్కడే ఉన్నాడు. తండ్రి ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఈ ఏడాది ఆగస్టులో స్వగ్రామానికి చేరుకున్నాడు. నిఘా ఉంచిన పోలీసులు శనివారం అతడి నివాసంలో సోదాలు చేయగా మారడోనా వాచీ లభించింది.