ముంబై : మహారాష్ట్రలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు ధ్వంసం చేశారు. 11 ట్రాక్టర్లతో పాటు రెండు జేసీబీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. బ్రమాఘద్ పరిధిలోని ఇర్పానగర్ గ్రామ పరిసరాల్లో శుక్రవారం ఈ ఘటనకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో 40 నుంచి 50 మంది మావోయిస్టులు పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరంతా దళం, మిలీషియా సభ్యులు అని తేలింది. ట్రాక్టర్లు, జేసీబీలు వివిధ నిర్మాణ సంస్థలకు చెందినవిగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోసం ఆ ఏరియాలో కూంబింగ్ నిర్వహించారు.
జార్ఖండ్లోని గిరిధ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కుఖ్రా పోలీసు స్టేషన్ పరిధిలో ఎయిర్టెల్ టవర్కు నిప్పు పెట్టారు. ఇద్దరు మావోయిస్టులు బైక్పై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మధుబన్ వద్ద ఐడియా టవర్ను బాంబులతో పేల్చేశారు.