ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం గత పక్షం రోజులుగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. అమిత్ షా లాంటి సీనియర్ మంత్రులు దీనికో తాత్వికతను, దార్శనికతను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ పౌరులు జాగృతమయ్యారని, ఇదో కొత్త వెలుగును తీసుకొచ్చిందనే భావనను జనం మస్తిష్కాల్లోకి ఎక్కించాలని చూస్తున్నారు.
‘మన్ కీ బాత్’ను ప్రజలంతా వినాలని ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు, మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ ‘బాత్’ ఏకపక్షంగా కాకుండా, తమ భాగస్వామ్యం కూడా ఉండాలని అశేష ప్రజానీకం భావిస్తున్నది. నిరుద్యోగులకు ఏం పరిష్కారం చూపారని యువత గద్దించి అడుగుతున్నది. గృహ సమస్యకు పరిష్కారాన్ని, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను ఎందుకు కల్పించలేక పోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని తన ఆలోచనలను ప్రజలతో పంచుకోవడం పట్ల ఎవరికీ అభ్యంత రం ఉండదు. దేశం నలుమూలలా ఉన్న నిస్వా ర్థ సేవకుల సాఫల్యతల గురించి, స్వీయ ప్రేరణ తో అద్భుతాలు సాధించిన వారి గురించి ప్రధా ని ప్రతి ఎపిసోడ్లో ప్రస్తావిస్తున్నారు. వారి అనుభవాలను, ప్రేరణగా నిల్చిన అంశాలను వారితోనే చెప్పిస్తున్నారు. ఇది ‘మన్ కీ బాత్’ విశ్వసనీయతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ మహనీయులకు కొత్తగా ఒరిగేదేమీ లేదు.
పట్నాలో పేద విద్యార్థుల కోసం సూపర్-30 శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వందలాది మంది ఐఐటీల్లో సీట్లు పొందడానికి కృషి చేస్తున్న మ్యాథ్స్ అధ్యాపకుడు ఆనంద్ కుమార్ ఎవరి నుంచి స్ఫూర్తి పొంది ఉంటారు?
అంతకు ముందు ఇటువంటి సంస్థలేవీ మనుగడలో లేవు. ఈ దేశం, మట్టి, సంస్కృతి, సమాజం పట్ల ఉన్న అవగాహన, చదువు ద్వారా పేదరికాన్ని ఓడించవచ్చన్న బృహత్ సంకల్పం ఆనంద్ కుమార్ను కదిలించాయి. తపాల శాఖ గుమస్తా కొడుకైన ఈ సృజనశీలి 1992 నుంచే విద్యాదానాన్ని ప్రారంభించారు. 2002లో సూపర్-30 సంస్థను స్థాపించిన తర్వాత ఆయన గురించి లోకానికి తెలిసింది. 2006 నుంచి 2010 వరకైతే ఏటా ఆయన సంస్థలో శిక్షణ తీసుకున్న 30 మందికి 30 మంది ఐఐటీల్లో సీట్లు సాధించారు. ఆనంద్ కుమార్ ఈ మహాయజ్ఞాన్ని భుజాలకు ఎత్తుకున్న మొదటి రోజుల్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఆ పేద యువకుడికి దన్నుగా నిల్చిందేమీ లేదు. ఆనంద్ త్యాగనిరతిని, పట్టుదలను ప్రశంసిస్తూ 2009లోనే డిస్కవరీ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా 3 గంటల పాటు డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో మొక్కవోని దీక్షతో 20 ఏండ్ల పాటు కాలువ తవ్వి తన గ్రామానికి నీరు తీసుకొచ్చిన లౌంగి భూయాన్, పచ్చదనం లేకపోతే మనిషికి మనుగడే లేదని తన జీవితకాలమంతా కోటి మొక్కలకు పైగా నాటిన ‘తెలంగాణ ట్రీ మ్యాన్’ దరిపల్లి (వనజీవి) రామయ్యలను ఎవరు ప్రోత్సహించారు.
సొంత కుటుంబసభ్యులే పిచ్చివాళ్లుగా జమ కట్టి తిరస్కరించినా పట్టుదలను విడిచిపెట్టని మహాయోగులు వీరంతా. ఈ పరంపర ఇవాళ్టిది కాదు. వేల ఏండ్లుగా దేశంలో కొనసాగుతున్నదే. ఇలాంటి సేవాతత్పరుల పేరును తమ ఖాతాలో వేసుకోవాలని ఎవరు చూస్తున్నారో అందరికీ అర్థం అవుతున్నది.
‘మన్ కీ బాత్’ను ప్రజలంతా వినాలని ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు, మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ ‘బాత్’ ఏకపక్షంగా కాకుండా, తమ భాగస్వామ్యం కూడా ఉండాలని అశేష ప్రజానీకం భావిస్తున్నది. నిరుద్యోగులకు ఏం పరిష్కారం చూపారని యువత గద్దించి అడుగుతున్నది. గృహ సమస్యకు పరిష్కారం ఏదని, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేక పోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తమ ఆలోచనలను ప్రధాని వినగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని కర్షకులు అంటున్నారు.
డీజిల్, పెట్రోలు ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. 2014-15లో లీటరు పెట్రోలు రూ.66, డీజిల్ రూ.50 కి దొరికేది. ఇప్పుడు లీటరు పెట్రోలు రూ.109.88, డీజిల్ రూ.98 గా ఉన్నాయి. దీని వల్ల సరుకు రవాణా వ్యయం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఎగబాకాయి. పప్పులు, వంట నూనెలు గతం లో ఎన్నడూ లేనంత భారం అయ్యాయి. వీటి గురించి ప్రజల మనసులోని మాటలను ప్రధాని వింటే బాగుండేది. ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు రష్యా నుంచి మన క్రూడాయిల్ దిగుమతులు 1 శాతమే ఉండేవి. ప్రస్తుతం అమెరి కా ఆంక్షలను ధిక్కరించి, బ్యారెల్ 50 డాలర్లకు అటుఇటుగా మనం దిగుమతి చేసుకుంటున్నది రోజుకు 1.6 లక్షల బ్యారెళ్లు. ముడి చమురులో 35 శాతం రష్యా నుంచి చౌకగా వస్తున్నా పెట్రో ల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదని జనం సంధించే ప్రశ్నలకు మన్ కీ బాత్లో జవాబు దొరుకుతుందా?
రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నది. 20 ఏండ్లుగా ఆ రాష్ట్రం రైతుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేని దుస్థితి నుంచి బయటపడటం లేదు. ఇంటి పెద్దను కోల్పోయిన వ్యవసాయ కుటుంబాల వ్యథలను వినేదెవరు? వారి ‘మన్ కీ బాత్’ ఎవరు ఆలకిస్తారు? విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిందెవరు? పెద్ద నోట్లను రద్దు చేసింది బ్లాక్మనీ బూచి చూపే కదా? చివరకు జరిగిందేమిటి? దేశం పదేండ్లు వెనక్కి పోయిందే కానీ నల్లధనాన్ని వెలికితీయలేక పోయారు. దీని గురించి ప్రజల మనసులో ఏముందో ఎప్పుడైనా అడిగారా? జీఎస్టీ తెచ్చిన తర్వాత చిరు వ్యాపారాలు కుదేలవడం తెలియలేదా? లఘు పరిశ్రమలు మూతపడి కోట్ల మంది ఉపాధి కోల్పోవడానికి నోట్ల రద్దు, జీఎస్టీలు కారణం కాదా? ఆ తర్వాత వచ్చిన కరోనా కొట్టిన దెబ్బతో దేశంలో ఆత్మహత్యలు ఏ స్థాయిలో పెరిగాయో జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వివరంగా చెప్పాయి. ప్రతి ఆత్మహత్య వెనక బలమైన కారణాలుంటాయి. సమస్య నుంచి బయటపడలేమని భావించినప్పుడే మానసిక దుర్భలత్వం ఆవరిస్తుంది. దానికి భరోసా కల్పించడం ఉపన్యాసాలతో వీలు కాదు. తెగిపోయిన ఉపాధి గొలుసుకు మరమ్మతులు చేసి అతికించాలి.
వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు మన్ కీ బాత్లో ప్రజాభిప్రాయాలు తీసుకోలేదెందుకు? ఏదైనా, అటు ఇటు వాదనలు వినగలిగితేనే కదా సమస్యకు పరిష్కారం లభిం చేది, మీరంటున్న స్ఫూర్తిదాయక విజయాలు నిజమయ్యేది. తత్వవేత్తలు, రుషులు, ఆధునిక మోటివేటర్లు, ప్రధానులు నెలకోసారి అరగంట సేపు రేడియోలో ఉద్వేగ పూరిత ప్రసంగాలు చేస్తే యావద్దేశం ప్రేరణ పొందడం ఎప్పుడైనా చూశామా? అలా ముందుకు దూసుకెళ్తే సంక్షేమ పథకాలు ఎందుకు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు?
నిధుల కేటాయింపు, క్రియాశీలత ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. పేదరిక నిర్మూలన చేయగలుగుతాం. ఆకాశవాణి తన 500 కేంద్రాల ద్వారా ప్రతి నెల ఆఖరి ఆదివారం అరగంట సేపు వినిపించే మన్ కీ బాత్, దిశను మార్చే కార్యక్రమం ఎప్పటికీ కాలేదు. మాటల కంటే పాలనా దక్షత, బాధిత ప్రజానీకం మనసులోని భావాలను తెలుసుకొని పరిష్కారాలు చూపగలిగితేనే ప్రయోజనం ఉంటుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఆర్.శైలేష్ రెడ్డి