Manchu Manoj | మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం కన్నప్ప. కొన్నేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం రేపు గ్రాండ్గా విడుదల కాబోతుంది. గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో మంచు మనోజ్ కన్నప్ప టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మంచు మనోజ్ తన ట్వీట్లో, కన్నప్ప టీమ్కు నా శుభాకాంక్షలు. ఈ సినిమా కోసం మా నాన్నగారు (మోహన్ బాబు), ఆయన బృందం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో, అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. అదే విధంగా నా లిటిల్ చాంప్స్ అరియానా, వివియానా, అవ్రామ్లు (మంచు విష్ణు పిల్లలు) వెండితెరపై మంచి జ్ఞాపకాలను పంచుకోనుండటం చూడటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని మనోజ్ రాసుకొచ్చాడు. ఇటు, తనికెళ్ల భరణి గారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, తనికెళ్ల భరణి గారి జీవితకాల స్వప్నం రేపు సాకారం కాబోతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ మనోజ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
అంతే కాకుండా, ఈ సినిమాలో నటించిన పలువురు సినీ దిగ్గజాలకు కూడా మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. మంచి హృదయం ఉన్న ప్రభాస్ గారికి, దిగ్గజాలు అయిన మోహన్లాల్ గారికి, అక్షయ్ కుమార్ గారికి, ప్రభుదేవా గారికి, ఈ సినిమాను ప్రేమతో, నమ్మకంతో ఆదరించిన ప్రతి ఒక్కరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ వెండితెరపై ప్రకాశించడం చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చారు. ఈ ప్రయాణాన్ని పరమశివుడు తేజస్సు, ప్రేమతో ఆశీర్వదించాలి అని తెలిపాడు. అయితే, ఈ ట్వీట్లో మనోజ్ తన తండ్రి, విష్ణు పిల్లలు, చిత్రంలోని ఇతర ప్రముఖుల పేర్లను ప్రస్తావించినప్పటికీ, తన సోదరుడు మంచు విష్ణు పేరును ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. దీనితో, వీరిద్దరి మధ్య సంబంధాలు అంతగా స్నేహపూర్వకంగా లేవనే అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి.