దుబాయ్: ఐపీఎల్లోకి మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్! అవును ఇది నిజమే. ప్రపంచంలోనే ప్రముఖ క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్లో భాగమయ్యేందుకు మాంచెస్టర్ సిద్ధమైనట్లు తెలిసింది. వచ్చే సీజన్లో రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ క్లబ్ కూడా బిడ్డింగ్పై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బిడ్డింగ్ ప్రక్రియ తేదీని అక్టోబర్ 10 తేదీకి వాయిదా వేసినట్లు వినికిడి. ఈ విషయాన్ని బోర్డు వర్గాలు కూడా ధృవీకరించాయి. ‘ఐపీఎల్ ఒక్క భారత్కే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. మాంచెస్టర్ యునైటెడ్ యజమానులు ఆసక్తి కనబర్చడం.. టెండర్ గడువు పొడిగించడానికి ఒక కారణం కావొచ్చు’ అని ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు చేరుతుండడంతో టెండర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఐపీఎల్కు ఉన్న ఆదరణతో చాలా సంస్థలు టెండర్ వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. వారందరి విజ్ఞప్తి నేపథ్యంలోనే ఆగస్ట్ 31వ తేదీతో ఉన్న గడువును అక్టోబర్ 10కి పొడిగించారు. టెండర్ దాఖలుకు రుసుమును రూ.10 లక్షలుగా (నాన్ రిఫండబుల్)గా నిర్దేశించారు. ఆసక్తి ఉన్న కంపెనీలు ittipl2021 @bcci.tv మెయిల్ చేయవచ్చని బోర్డు పేర్కొంది.