మంచిర్యాల, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివారులో మిర్చి తోటల పరిశీలన పేరుతో వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకొన్నారు. తమ కల్లాల్లోకి రావొద్దంటూ హెచ్చరించారు. ఏం ఉద్ధరించడానికి వచ్చారంటూ కమలం పార్టీ నాయకులపై తిరగబడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమను పావులుగా వాడుకొంటే సహించబోమని స్పష్టంచేశారు. బీజేపీ నాయకులకు మద్దతుగా అక్కడికి వచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకట్స్వామిపైనా మర్లబడ్డారు.
‘మా పొలాల్లో మీకేం పని?’ అంటూ నిలదీశారు. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వస్తే రైతులకు లాభమే కదా.. దానిపై మీ రాజకీయం ఏంది?, మేము బాగుపడటం మీకు ఇష్టం లేదా అని రైతన్నలు బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. ఊహించని రీతిలో అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో బీజేపీ నాయకులు, వివేక్ వెంకటస్వామి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. కాగా, రైతులు తిరగబడితే టీఆర్ఎస్ నాయకులు దాడిచేశారంటూ బీజేపీ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులపై బీజేపీ నాయకుల దాడిని ఖండించారు.