లక్నో : అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన వ్యక్తి ఉదంతం యూపీలో వెలుగుచూసింది. బులంద్షహర్ జిల్లా షికార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. తన భార్య, ఇద్దరు కూతుళ్లను సుత్తితో కొట్టి చంపిన అనంతరం సయీద్ అనే నిందితుడు ఘటనా స్ధలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో మూడవ కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. భార్య, కుమార్తెల ప్రవర్తనపై అనుమానంతోనే నిందితుడు ఈ ఘూతుకానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
కిరాతకంగా వ్యవహరించిన తండ్రిపై నిందితుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితులను భార్య షకీలా (50), రజియా (20), సుల్తానా(18)గా గుర్తించారు. భార్య, కుమార్తెల ప్రవర్తనపై అనుమానంతో నిందితుడు తరచూ వారితో ఘర్షణ పడేవాడని పోలీసులు తెలిపారు. బాధితులు నిద్రలో ఉండగా వారిని సుత్తితో కొట్టి చంపాడని, ఆపై స్ధానికులకు ఆయన కోడలు జరిగిన విషయం చేరవేసిందని చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని బులంద్షహర్ ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.