ముంబై: శరన్నవరాత్రుల సందర్భంగా డ్యాన్స్ చేస్తూ ఒక వ్యక్తి కుప్పకూలి చనిపోయాడు. ఆసుపత్రికి తరలించిన తండ్రి కుమారుడి మరణ వార్త తెలుసుకుని షాక్తో మరణించాడు. మహారాష్ట్రలోని పాల్ఘఢ్ జిల్లాలో ఈ విషాదకర సంఘటన జరిగింది. విరార్లోని గ్లోబల్ సిటీ కాంప్లెక్స్లో దసరా వేడుకల సందర్భంగా శనివారం రాత్రి గర్బా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 35 ఏళ్ల మనీష్ నారాప్జీ సోనిగ్రా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. 66 ఏళ్ల తండ్రి నారాప్జీ సోనిగ్రా తన కుమారుడ్ని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అయితే ఆ వ్యక్తి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి మరణ వార్త విన్న తండ్రి కూడా షాక్తో కుప్పకూలి మరణించాడు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి దీనిపై ఆరా తీశారు. తండ్రీ కుమారుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పండుగ వేళ తండ్రీ కుమారులు ఒక్కసారే మరణించడంతో మృతుల కుటుంబంలో విషాదం నెలకొన్నది.