చార్మినార్, నవంబర్ 23: సందర్శకులతో కిటకిటలాడుతున్న జూపార్క్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. లయన్ మోట్ (రక్షణగోడ)పై నిలబడిన ఓ వ్యక్తి అందులోకి దూకేందుకు ప్రయత్నించగా గమనించిన సందర్శకులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు. జూపార్క్, బహదూర్పుర పోలీసుల వివరాల ప్రకారం.. కీసరకు చెందిన సాయికుమార్ (31) స్థానికంగా ఉన్న హోటళ్లలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. మంగళవారం జూపార్కు సందర్శన కోసం వచ్చిన సాయికుమార్ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆఫ్రికన్ లయన్స్ (రాధ,కృష్ణ) ఉన్న మోట్ వద్దకు చేరుకున్నాడు.
అనంతరం సింహాల వద్ద రత్నాభరణాలు ఉంటాయని అరుస్తూ ఎన్క్లోజర్లోకి దూకబోయాడు. అప్పటికే సందర్శకుల కోసం సింహాలను అధికారులు మోట్లోకి వదలడంతో పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అతడి ప్రయత్నాలను నిలువరించారు. అనంతరం జూ పార్కు అధికారులు అదుపులోకి తీసుకొని బహదూర్పుర పోలీసులకు అప్పగించారు. సాయికుమార్ కొంత మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు గుర్తించామని బహదూర్ పుర ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.