శ్రీశైలం : మల్లన్న భక్తులకు శ్రీశైలం దేవస్థానం శుభవార్త చెప్పింది. దసరా మహోత్సవాల ప్రారంభం నుంచి సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి భక్తులందరికీ అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. గతంలో వారంలో నాలుగు రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు సర్వదర్శనం క్యూలైన్ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించే వారు. సామాన్య భక్తులకు సైతం స్వామివారి స్పర్శ దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30గంటల వరకు అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే, దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ సంప్రదాయం ప్రకారం రావాలని సూచించింది. ఈ మేరకు భక్తులు సహకరించాలని ఈఓ లవన్న కోరారు.