తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Salakatla Brahmotsavam) మూడో రోజు ఆదివారం ఉదయం మలయప్పస్వామి సింహ వాహనంపై (Simha Vahanam) యోగనరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయిందని ఆలయ అర్చకులు తెలిపారు.
సింహ రూప దర్శనంతో సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుందని అన్నారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ (Srinivas Varma) , సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, జేఈవోలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.