లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
అన్నిశాఖల మహిళా సిబ్బందికి సన్మానాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 8: రాష్ట్రవ్యాప్తంగా మహిళాబంధు సంబురాలు ఘనంగా కొనసాగాయి. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విభిన్నకార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం అన్నిశాఖల మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించింది. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి చెక్కులను అందజేశారు. ఆడబిడ్డలకు చీరలు పెట్టి సత్కరించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీచేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సొంత ఖర్చుతో మహిళాసిబ్బంది, ప్రజాప్రతినిధులు సుమారు 1000 మందికి చీరలను పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని, వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలను సతరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు ఖానాపూర్లో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో నిర్వహించిన మహిళాదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొని మహిళలను సన్మానించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై, నియోజకవర్గంలోని మహిళ ప్రజాప్రతినిధులు, ప్రముఖ మహిళలను ఘనంగా సన్మానించారు.