కథానాయకుడిగా పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు సుధీర్ బాబు. ‘శివ మనసులో శృతి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సుధీర్ బాబు…‘ప్రేమ కథా చిత్రమ్’, ‘సమ్మోహనం’, ‘వీ’ చిత్రాలతో హీరోగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తన నట ప్రయాణంలోని అనుభవాలను పాత్రికేయులతో పంచుకున్నారు సుధీర్ బాబు.
ఆ విశేషాలు చూస్తే.. అనుభవాలే నేర్పాయి
నాకంటూ ఓ గుర్తింపు, గౌరవం కావాలనే కోరికతో చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాను.‘శివ మనసులో’ శృతి చిత్రానికి పెట్టుబడి నాదే. తొలి రోజుల్లో ఇతను హీరోగా బాగోడు అని అన్నారు. అలాంటి వాళ్ల విమర్శల నుంచే పట్టుదలగా ఎదిగాను. నా గొంతు మొదట్లో పీలగా ఉండేది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దగ్గర మాట్లాడటం సాధన చేశాను. నటించడంలోనూ మెరుగయ్యాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కెరీర్ మొదట్లోనే కొన్ని అపజయాలు రావడం వల్ల ఎలాంటి సినిమాలు చేయకూడదో నేర్చుకున్నాను. ‘భాఘీ’చిత్రంతో బాలీవుడ్ లో ప్రతినాయకుడిగా నటించాను. ఆ తర్వాత అలాంటి పాత్రలు చాలా వచ్చాయి. ‘బ్రహ్మాస్త్ర’చిత్రంలోనూ విలన్ గా నటించమని అడిగారు. కానీ నా తొలి ప్రాధాన్యం తెలుగు చిత్ర పరిశ్రమకే.
జాకీచాన్ యాక్షన్ చిత్రాలంటే ఇష్టం
పదేళ్ల కెరీర్ పై సంతృప్తిగా ఉన్నాను. మంచి సినిమాలు వస్తే ఎంతైనా శ్రమించేందుకు సిద్ధం. ఫార్ములా కథలకు దూరంగా కొన్ని ప్రయత్నాలు చేశాను. కానీ మన ప్రేక్షకులకు కమర్షియల్ సినిమాలు కూడా కావాలి. పాన్ ఇండియా చిత్రాలు, వెబ్ సిరీస్ లూ చేయాలని ఉంది. ఏదైనా ఆ టీమ్ ను బట్టే ఉంటుంది. యూనిట్ బాగా కుదిరితే నటించేందుకు అభ్యంతరం లేదు. నాకు జాకీచాన్ యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. అలాంటి యాక్షన్ చిత్రాలు చేయాలని ఉంది. ఇన్నేళ్లలో సినిమాల పరంగా ఇది కావాలని మహేష్ బాబును అడగలేదు. కానీ కుటుంబానికి ఎలా సమయం కేటాయించాలి అనే విషయాలను కృష్ణ గారు, మహేష్ బాబు దగ్గర నుంచి నేర్చుకున్నాను. నా కొత్త సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’కొత్త తరహాలో ఉంటూ ఆకట్టుకుంటుంది.