హీరో కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మృతితో కృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాలు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ ఇందిరాదేవి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణ, మహేష్ బాబును కేటీఆర్ ఓదార్చారు. ఇందిరాదేవి భౌతికకాయానికి వెంకటేష్, నాగార్జున, విజయ్ దేవరకొండ, గోపీచంద్, మోహన్ బాబు, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. వీరిలో రమేష్ బాబు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఇందిరాదేవి భౌతికకాయాన్ని ఉంచిన అనంతరం కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.