చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకుల్లో ఎప్పటికీ ఉత్సుకతను రేకెత్తిస్తుంటాయి. అలాంటి వాటిలో మహేష్బాబు-త్రివిక్రమ్ కలయిక ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు వినూత్న కథాంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తాజాగా వీరిద్దరి మూడో చిత్రానికి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించబోతున్న తాజా చిత్రం ఫిబ్రవరి మూడో తేదీన లాంఛనంగా ప్రారంభం కానుంది.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం..రెగ్యులర్ షూటింగ్ను మార్చి ద్వితీయార్థంలో మొదలుపెడతామని తెలిపింది. మహేష్బాబు నటిస్తున్న 28వ చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై యస్.రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించనుంది. తమన్ స్వరకర్త.