ముంబై: తన కుమారుడి కోరిక తీర్చేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పాత కారు తుక్కు విడిభాగాలతో తయారు చేసిన వాహనానికి మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఫిదా అయ్యారు. ఆ వాహనాన్ని తనకు ఇస్తే ప్రతిగా బొలెరో వాహనం ఇస్తానంటూ భారీ ఆఫర్ ఇచ్చారు. ఈ వాహనం ఎలా పనిచేస్తుందో చూపించే ఓ యూట్యూబ్ చానల్లోని 45 సెకండ్ల వీడియోను షేర్ చేశారు.‘తక్కువతో ఎక్కువ’ చేసి చూపిన అతని సామర్థ్యాన్ని ప్రశంసిస్తున్నానన్నారు. దేవ్రాష్ర్టే అనే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహొర్ అనే వ్యక్తి వృత్తిరీత్యా కమ్మరి. కుమారుడి కోసం తుక్కు, అవసరమైన పలు ఇతర వస్తువులతో వాహనాన్ని తయారు చేశారు. దీనికి రూ.60 వేలు ఖర్చు అయిందని లోహొర్ వీడియోలో చెప్పారు. దీనిలో కిక్స్టార్ట్ మెకానిజం కూడా ఉందని తెలిపారు.