ప్రయాగ్రాజ్, ఏప్రిల్ 30: దేశంలోనే తొలిసారిగా షెడ్యూల్డ్ కులానికి చెందిన స్వామీజీ ‘జగద్గురు’ బిరుదు పొందారు. దేశంలోని 13 అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా.. మహామండలేశ్వర్ మహేంద్రానందగిరికి ఈ బిరుదును ప్రదానం చేసింది. మహేంద్రానంద శిష్యుడు కైలాశానందగిరికి మహామండలేశ్వర్, రాంగిరికి శ్రీమహంత్ బిరుదు ప్రదానం చేసింది. వీరిద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ప్రయాగ్రాజ్ జునా అఖాడాలోని సిద్దబాబా మౌజిగిరి ఆశ్రమంలో సోమవారం వీరు వేదమంత్రోచ్చారణల మధ్య బిరుదులు స్వీకరించారు. ముగ్గురు స్వామీజీలు గుజరాత్కు చెందినవారు కాగా స్వామి మహేంద్రానంద సౌరాష్ట్ర రాజ్కోట్ జిల్లాలోని బానాల గ్రామానికి చెందినవారు.
కాశీ సుమేరు పీఠాధీశ్వర్ జగద్గురువు, జునా అఖాడా అంతర్జాతీయ అధ్యక్షుడు స్వామి నరేంద్రానంద సరస్వతితోపాటు శ్రీమహంత్ ప్రేమ్గిరి, శ్రీదుధేశ్వర పీఠాధీశ్వర్, జునా అఖాడా, అంతర్జాతీయ అధికార ప్రతినిధి శ్రీమహంత్ నారాయణగిరి, మహామండలేశ్వర్ వైభవ్ తదితరులు బిరుదులు అందుకున్న వారిని పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమం సందర్భంగా మహేంద్రానంద, కైలాశలనందను సింహాసనంపై కూర్చోబెట్టి ఛత్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీమహంత్ ప్రేమ్గిరి మాట్లాడుతూ సన్యాసి సంప్రదాయంలో పాతుకుపోయిన కుల, వర్గ వివక్షను నిర్మూలించేందుకు జునా అఖాడా పనిచేస్తున్నట్టు చెప్పారు. మహాకుంభ్-2025కు ముందు ఈ దిశగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ షెడ్యూల్డ్ కులాల వారికి జగద్గురు, మహామండలేశ్వర్, శ్రీమహంత్ వంటి ముఖ్యమైన బిరుదులను ప్రదానం చేస్తున్నట్టు చెప్పారు. జగద్గురు నరేంద్రానంద సరస్వతి మాట్లాడుతూ జునా అఖాడా నిర్ణయం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 2021లో హరిద్వార్ కుంభమేళాలో జునా అఖాడా మహేంద్రానందకు మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. కార్యక్రమంలో స్వామి నరేంద్రానంద సరస్వతి, తదితరులు మాట్లాడారు.